భార్యాపిల్లల గదిలోకి పామును వదిలిండు ..  ఇద్దరూ మృతి

భార్యాపిల్లల గదిలోకి పామును వదిలిండు ..  ఇద్దరూ మృతి

భువనేశ్వర్: కట్టుకున్న భార్యను, కన్న కూతురిని పాముతో కరిపించి చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. కబీసూర్యనగర్ ఏరియాలోని అధెగావ్ గ్రామానికి చెందిన కే.గణేశ్ పాత్రా(25)కు అదే గ్రామానికి చెందిన బసంతి(23)కి మూడేండ్ల క్రితం పెండ్లి జరిగింది. ప్రస్తుతం వారికి దేబాస్మిత అనే రెండేండ్ల కూతురు ఉంది.  ఇటీవల తన భార్యపై అనుమానం పెంచుకున్న గణేశ్.. అనుమానం రాకుండా వారిని తుదముట్టించాలని ప్లాన్ వేసిండు.

పాములు పట్టేవాడి దగ్గర విషం ఉన్న నాగుపామును కొన్నాడు. దానిని భార్య, కూతురు పడుకున్న గదిలోకి విడిచిపెట్టాడు. నిద్రలో ఉన్న తల్లీకూతుళ్లను పాము కాటేసింది. బాధితుల అరుపులకు గదిలోకి వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు పామును గుర్తించి కొట్టి చంపారు. బసంతిని, దేబాస్మితను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసుల దర్యాఫ్తులో నిందితుడు గణేశేనని తేలింది. ఆధారాలు సేకరించి పోలీసులు గణేశ్​ ను అరెస్టు చేశారు.